కలం, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన దళపతి విజయ్ (Vijay) సంచలన విజయం సాధించారు. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ విజయ్ తన తొలి ప్రయత్నంలోనే టీవీకే పార్టీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టాడు. 49 ఏళ్ల తర్వాత ఎంజీఆర్ తరహాలో ముఖ్యమంత్రి పీఠం దిశగా అడుగులు వేశాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని దశాబ్ద కాలం ఊరించి వెనక్కి తగ్గగా, కమల్ హాసన్ పార్టీ ఓట్ల శాతం పట్టణాలకే పరిమితమైంది. అయితే విజయ్ మాత్రం పక్కా ప్రణాళికతో విజయం అందుకున్నాడు.
విజయ్ విజయానికి ప్రధాన కారణం ఆయనకున్న స్పష్టత అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తన 30 ఏళ్ల సినీ కెరీర్ను వదులుకుని పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారుతానని చెప్పడం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది. అలాగే ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగడం ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. గత 10 ఏళ్లుగా ఆయన అభిమాన సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మమేకమై ఉండటం కూడా పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన పునాదిని ఇచ్చింది.
మరో ముఖ్యమైన అంశం వయస్సు, యువత మద్దతు. రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ రాజకీయాల పట్ల ఆలస్యంగా ఆసక్తి చూపారు. కానీ విజయ్ 51 ఏళ్లకే రంగంలోకి దిగారు. తమిళనాడులో దాదాపు 40 శాతం ఉన్న యువ ఓటర్లను విజయ్ తన వైపు తిప్పుకోగలిగారు. పాత పార్టీలపై ఉన్న అసంతృప్తిని తన అనుకూలంగా మార్చుకున్నారు. జెన్-జెడ్ నేతగా ఆయన సాగించిన ప్రచారం ఆకట్టుకుంది. ఫలితంగా విజయ్ రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశాడు.

