కలం, జడ్చర్ల : గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కారణంగా అనేక మంది పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే (Jadcherla MLA) అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.
గ్రామ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గ్రామ అభివృద్ధికి రూ. 30 లక్షల MUDA నిధులు కేటాయించి వివిధ అభివృద్ధి పనులకు సహకారం అందించినట్లు తెలిపారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి, అధ్వానంగా ఉన్న అనేక రహదారులను మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయించామని తెలిపారు.
చర్లపల్లి నుంచి గంగాపూర్ వరకు మిగిలి ఉన్న రహదారిని కూడా త్వరలోనే మంజూరు చేయించి నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జడ్చర్ల నియోజకవర్గానికి రావాల్సిన MUDA నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించారని ఎమ్మెల్యే విమర్శించారు. తాను MUDA సమావేశంలో నియోజకవర్గానికి రావాల్సిన నిధులు తప్పనిసరిగా జడ్చర్లకే కేటాయించాలని పట్టుబట్టానని, దాని ఫలితంగానే ప్రస్తుతం MUDA నిధుల్లో 30 శాతం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగిందని స్పష్టం చేశారు.
అదేవిధంగా బాలానగర్ మండలంలో HMDA ద్వారా మంజూరైన రూ. 2 కోట్ల నిధులతో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
జడ్చర్ల నియోజకవర్గంలో విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ట్రైబల్ IIIT కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, నవోదయ విద్యాలయం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
మన పిల్లల భవిష్యత్తు బాగుంటేనే మన ప్రాంతాల భవిష్యత్తు బాగుంటుందని, విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.

