కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లాలో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ (29వార్డు), పెబ్బేరు మున్సిపాలిటీ రెండో వార్డులో, బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓలు) ద్వారా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో భాగంగా జులై ఒకటో తేదీలోగా ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారాలను పూరించే విధానాన్ని బీఎల్ఓలు తెలియజేయాలన్నారు. ఫారాలను తిరిగి సేకరించే ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జడ్పీ సీఈవో యాదయ్య, పెబ్బేరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమోదిని, వైస్ ఛైర్మన్ విజయ్ వర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు రమేష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

