కలం, వెబ్ డెస్క్ : విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాస్పోర్టు ఫీజులను (Passport Fee Hike) భారీగా పెంచుతూ కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 36 పేజీల పాస్పోర్ట్ ఫీజు రూ.1500 నుంచి రూ.2500కు , అలాగే 60 పేజీల పాస్పోర్ట్ ఫీజును రూ. 2000 నుంచి రూ.3500కు పెంచింది. అలాగే 36 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.5,000కు , 60 పేజీల తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.6000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఫీజులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.
పాస్పోర్టులో పేజీల ఉపయోగం ఇలా..
ఏదైనా దేశానికి వెళ్లినప్పుడు , ఆ దేశానికి సంబంధించిన వీసా స్టాంప్ వేయడానికి, అలాగే ఆ దేశంలో అడుగుపెట్టినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎయిర్ పోర్ట్లో వేసే ఇమ్మిగ్రేషన్ స్టాంపుల కోసం పాస్పోర్టులో పేజీలు ఉపయోగపడతాయి. 10 ఏళ్ల వ్యాలిడిటీలో ఒకటి , రెండు సార్లు మాత్రమే విదేశాలకు వెళ్లే వారైతే 36 పేజీల పాస్పోర్ట్ సరిపోతుంది. అదే తరచూ విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, వ్యాపారులు 60 పేజీలు పాస్పోర్ట్ను తీసుకోవాల్సి ఉంటుంది.

