కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం కేంద్రంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దక్షిణ తీర రైల్వే జోన్ (South Coast Railway) ఈ ఏడాది జూన్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Minister Ashwini Vaishnaw ) కీలక ప్రకటన చేశారు. దీర్ఘకాలంగా ఈ జోన్ కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. పది సంవత్సరాల పాటు విధాన నిర్ణయం తీసుకోడానికి తటపటాయించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరిన తర్వాత సాకారమైంది.
కోల్కతా, చెన్నై నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రెండు రైల్వే లైన్లను నాలుగు లైన్లుగా అప్ గ్రేడ్ అవుతుందని మంత్రి తెలిపారు. ఈ ఆధునీకరణ పనుల వల్ల భవిష్యత్తులో కొత్తగా 500 రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా, సరుకు రవాణా (కార్గో) రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నౌకాశ్రయాలు, పర్యాటక స్థలాలు, సాంస్కృతిక కేంద్రాలకు వెళ్లే సందర్శకులకు ఈ కొత్త రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి.
రైల్వే బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా ఏపీకి ప్రాధాన్యత పెరిగినట్లు మంత్రి వివరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి కేవలం 886 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: అమరావతికి 70 నిమిషాల్లోనే.. బుల్లెట్ ట్రైయిన్
Follow Us On: Sharechat

