కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ, ఇంద్రనగర్ ప్రాంతాలలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, న్యూసెన్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్ (Nirmal Councillor) మంచాల శ్రీకాంత్ యాదవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు (Janaki Sharmila) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ, ఇంద్రనగర్ సమీపంలోని గాంధీ కూరగాయల మార్కెట్లో కొంతమంది విక్రయదారులు రోడ్డుపైనే కూరగాయలు విక్రయించడం వల్ల తరచూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అలాగే రాత్రి సమయాలలో టీ స్టాళ్లు, పాన్ షాపుల వద్ద కొందరు వ్యక్తులు సిగరెట్లు, గుట్కాలు సేవిస్తూ న్యూసెన్స్కు పాల్పడుతున్నారని, దీనివల్ల మహిళలు, స్థానిక ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. జయశంకర్ చౌరస్తా వద్ద ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని కౌన్సిలర్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, న్యూసెన్స్కు అడ్డుకట్ట వేయాలని కోరారు.

