కలం, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ను సొంతింట్లో చావు దెబ్బ కొట్టిన చెన్నైకి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కీలక హెచ్చరిక చేశాడు. గెలిచిన తరుణంలో చెన్నైకి సెహ్వాన్ హెచ్చరిక చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం సీఎస్కే విజయోత్సాహంలో ఉన్నప్పటికీ, జట్టులో ఒక ప్రధాన లోపం ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. చెన్నై విజయాన్ని మెచ్చుకుంటూనే, ఆ జట్టు కేవలం ఒక్క బ్యాటర్పైనే ఆధారపడుతోందని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఫామ్లో ఉన్న ఆయుష్ మాత్రే గాయం వల్ల జట్టుకు దూరం కావడంతో టాప్ ఆర్డర్లో శాంసన్ ఒక్కడే పరుగులు చేస్తున్నాడన్నాడు. ఒకవేళ సంజూ త్వరగా అవుటయితే పరిస్థితి ఏంటని సెహ్వాగ్ ప్రశ్నించాడు. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్ వంటి ఆటగాళ్లు త్వరగా ఫామ్లోకి వచ్చి శాంసన్కు మద్దతు ఇవ్వాలని సూచించాడు.
ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ (Sanju Samson) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది అతనికి ఈ సీజన్లో రెండో సెంచరీ కాగా, ఐపీఎల్ కెరీర్లో ఐదోది. సంజూ మెరుపు ఇన్నింగ్స్ వల్ల చెన్నై నిర్ణీత ఓవర్లలో 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబైని చెన్నై బౌలర్లు 104 పరుగులకే కట్టడి చేశారు. శాంసన్ ఆటతీరును సెహ్వాగ్ ప్రశంసించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా శాంసన్ ఎంతో బాధ్యతగా ఆడి జట్టును ఆదుకున్నారని కొనియాడాడు. శాంసన్ ఒకసారి క్రీజులో కుదురుకుంటే భారీ స్కోరు చేస్తాడని, ఈ మ్యాచ్లో తన పనిని ఎంతో ప్రశాంతంగా పూర్తి చేశాడని సెహ్వాగ్ (Virender Sehwag) అభిప్రాయపడ్డాడు.
Read Also: ఆర్సీబీలో పెను మార్పులు : అశ్విన్
Follow Us On : WhatsApp

