కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026 (T20 WC 2026) కు ముందు టీమిండియాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో భారత స్క్వాడ్పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత భారత జట్టును 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుతో పోల్చారు. ప్రస్తుత జట్టు గతంలో గెలిచిన జట్టుకన్నా చాలా బలంగా ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. 2007లో ధోనీ నాయకత్వంలో యువ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ చరిత్ర సృష్టించింది. అప్పట్లో అనుభవం తక్కువగా ఉన్నా, ఆత్మవిశ్వాసం జట్టును విజేతగా నిలిపింది.
ఇప్పుడు ప్రస్తుత జట్టులో అన్ని విభాగాల్లో లోతైన బలం ఉందని సెహ్వాగ్ (Sehwag) చెప్పారు. ఆల్రౌండర్లు, స్పిన్నర్లు, పేస్ బౌలర్లు సమతుల్యంగా ఉన్నారని తెలిపారు. కీలక సమయంలో పరిస్థితులు అనుకూలిస్తే ట్రోఫీ గెలిచే సామర్థ్యం జట్టుకు ఉందని అంచనా వేశారు. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలో ఇటీవల జట్టు మంచి ఫామ్లో ఉందని గుర్తు చేశారు. న్యూజిలాండ్పై 4-1 సిరీస్ విజయం ఈ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పారు.
అయితే టోర్నీ సమయంలో బాహ్య ఒత్తిడికి దూరంగా ఉండాలని సెహ్వాగ్ సూచించారు. సోషల్ మీడియా ప్రభావాన్ని పక్కనపెట్టి ఆటపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత జట్టు ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 7న అమెరికాతో ఆడే మ్యాచ్తో వరల్డ్ కప్ ప్రయాణం మొదలవుతుంది.


