కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli), తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను వెల్లడించారు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో, తాను గత ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నప్పటికీ, ఇంకా వంద శాతం ఫిట్నెస్ సాధించలేదని ఆయన వివరించారు. గత మ్యాచ్ సమయంలో మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డానని, దానికి తోడు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం కూడా సహకరించడం లేదని కోహ్లీ (Virat Kohli) తెలిపారు.
అయితే గత మ్యాచ్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం మెరుగ్గా అనిపిస్తోందని చెప్పారు. లక్నోపై ఇన్నింగ్స్ను ఉత్సాహంగానే ప్రారంభించానని, తన బ్యాటింగ్ వేగం పట్ల సంతృప్తిగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే క్రీజులో మరికొంత సేపు ఉండి మ్యాచ్ను పూర్తి చేసి ఉంటే బాగుండేదని ఆయన తన మనసులో మాటను పంచుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్లో ఉండటం ఆర్సీబీకి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు తన తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 18, శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. ఈ సీజన్లో తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ విజయం సాధించి అజేయంగా కొనసాగుతోంది.

