కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ (Vijay).. మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
విజయ్ ఏం మాట్లాడారు?
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్ష పాత్ర మరింత సమర్థంగా ఉండాలని విజయ్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ప్రభుత్వానికి సహకారం అందించడంతోపాటు ప్రజల సమస్యలను నిర్మాణాత్మకంగా ప్రస్తావించాలని స్టాలిన్కు సూచించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాహిత అంశాల్లో కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. డీఎంకే నిర్మాణాత్మక సూచనలు చేయాలని విజయ్ కోరినట్టు సమాచారం.
భిన్నంగా వ్యవహరించిన విజయ్
ముఖ్యమంత్రి, ప్రత్యర్థి పార్టీ నేతలు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకోవడం, కక్ష పూరిత నిర్ణయాలు తీసుకోవడం సహజంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయితే ఈ వాతావరణం ఇలాగే కొనసాగుతుందా? లేదంటే మారుతుందా? అన్నది వేచి చూడాలి.

