కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ (Vijay) స్థాపించిన టీవీకే పార్టీ సంచలన విజయం నమోదు విషయం తెలిసిందే. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 స్థానాలు అవసరం. ఈ సీట్ల కోసం ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం తమిళగ వెట్రి కళగం (టీవీకే) శాసససభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయ్ను ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు
సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై సుదీర్ఘంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి మెజారిటీ లేని నేపథ్యంలో, ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయాన్ని కూడా విజయ్ (Vijay) కే అప్పగించినట్టు సమాచారం. టీవీకే అధినేత విజయ్ రేపు (బుధవారం) గవర్నర్తో భేటీ కాబోతున్నట్టు సమాచారం. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా, రాజకీయంగా స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైందని వర్గాలు చెబుతున్నాయి.
ఏ పార్టీతోనూ రాజీపడొద్దు
అధికారంలోకి రావాలనే తాపత్రయంలో ఏ పార్టీతోనూ రాజీపడాల్సిన అవసరం లేదని.. పార్టీ ప్రాథమిక విలువలను కాపాడుకుంటూనే నిర్ణయాలు తీసుకోవాలని మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. మద్దతు కోసం ఇతర పార్టీల దగ్గర తలవంచే పరిస్థితులు రానీయబోమని నేతలు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇతర పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వొచ్చని, కానీ టీవీకే మాత్రం తన సిద్దాంతాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోదని నిర్ణయించినట్లు సమాచారం. టీవీకేతో భావస్వారుప్యం ఉన్న పార్టీలతోనే పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
Read Also: విజయ్ గెలుపు వెనుక ఉన్నదెవరో తెలుసా?
Follow Us On : WhatsApp

