కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్దేశించిన ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తుల జోక్యంపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.

