కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రత్యేక చొరవతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే (Vemulawada MLA) ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు ఇప్పటికే సుమారు 45 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. వేములవాడ పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన, ఆలయ అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే నాలుగు అంశాల ఆధారంగా సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
వేములవాడ పట్టణంలో రూ.49.50 లక్షల వ్యయంతో డంపింగ్ యార్డుకు వెళ్లే అప్రోచ్ సీసీ రోడ్డు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ప్రధాన రహదారుల విస్తరణ, మూడో వంతెన నిర్మాణం, మురుగునీటి సమస్య పరిష్కారం వంటి కీలక పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
అలాగే ఎస్టీ, బీసీ, అంబేద్కర్, క్రిస్టియన్ భవనాలు, షాదీఖానాల నిర్మాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. పట్టణాభివృద్ధి, ఆలయాభివృద్ధిని ప్రభుత్వం రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

