కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB) జట్ల మధ్య పోరుకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ క్రేజ్ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల పేరుతో జరిగే మోసాలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) క్రికెట్ అభిమానులను హెచ్చరించారు. ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ను ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ యాప్లు, వెబ్సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అనేక నకిలీ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్’ యాప్ను పోలిన రంగులు, లోగోలతో కేటుగాళ్లు నకిలీ యాప్లను సృష్టించారు. తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ నమ్మబలుకుతూ అభిమానులను ఆకర్షిస్తున్నారు.
అచ్చం అసలు యాప్ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా, బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ యాప్ లు, వెబ్ సైట్స్ పై తాము నిఘా ఉంచామని వెల్లడించారు. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

