కలం, వెబ్డెస్క్: అమాయక ప్రజలను మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా కేటుగాళ్లు వదలడం లేదు. నకిలీ పత్రాలను చూపించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఏకంగా రూ.20 కోట్లు టోకరా పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ (Hyderabad) రాయదుర్గంలోని సర్వే నంబర్ 66/2లో ఉన్న అత్యంత విలువైన భూమిని విక్రయిస్తామని చెప్పి వాసవి గ్రూప్ (Vasavi Group) యజమాని ఎర్రం విజయ్ కుమార్ (Yerram Vijay Kumar) ను వలలో వేసుకున్నారు కేటుగాళ్లు. నిందితులు దుగ్యాల పాపారావు, అట్టేపల్లి రామ ప్రభు, ఇతర వ్యక్తులు ఆ భూమి విక్రయించేందుకు తమకు అన్నీ అనుమతులు ఉన్నాయని నకిలీ పత్రాలు చూపించారు. ఇది నమ్మిన యజమాని ఎర్రం విజయ్ కుమార్ 2023 డిసెంబర్ 7వ తేదీన రూ. 35 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు.
ఒప్పందంలో భాగంగా వారికి రూ.20 కోట్లు కూడా చెల్లించాడు. డబ్బులు తీసుకున్న నిందితులు 3, 4 నెలల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని యజమానిని నమ్మించారు. అయితే రోజులు గడుస్తున్నా వారు స్పందించకపోవడంతో విజయ్ కుమార్కు అనుమానం వచ్చింది. వెంటనే ఎంక్వైరీ చేయగా సదరు భూమి 38-E ప్రొటెక్టెడ్ టెనెన్సీ ప్రకారం నిషేధిత జాబితాలో ఉందని తెలుసుకుని విజయ్ కుమార్ షాకయ్యాడు. తాను మోసం పోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలు, వ్యాపారులు ఇటువంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

