కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ఉత్తర రైల్వే పరిధిలోని జమ్మూ డివిజన్ శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా – బనిహాల్ మధ్య ఉన్న 111 కిలోమీటర్ల నూతన బ్రాడ్ గేజ్ రైల్వే సెక్షన్లో రైళ్ల గరిష్ట వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ప్రసిద్ధి చెందిన చీనాబ్ బ్రిడ్జి (Chenab Bridge) మీదుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలిసారిగా గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కొత్త రికార్డు సృష్టించింది.
గతంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల వేగంపై పరిమితులు ఉండేవి. శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుండి సంగల్దాన్ వరకు ఉన్న సెక్షన్లో గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగానికి, అలాగే సంగల్దాన్ నుండి బనిహాల్ వరకు ఉన్న సెక్షన్లో 75 కిలోమీటర్ల వేగానికి మాత్రమే అనుమతి ఉండేది. ప్రస్తుతం రైల్వే శాఖ అనుమతితో వేగాన్ని 100 కిలోమీటర్లకు పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. భౌగోళికంగా ఎంతో సవాలుతో కూడుకున్న ఈ హిమాలయ ప్రాంతంలో ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన చీనాబ్ బ్రిడ్జిపై రైళ్లు ఇంత వేగంతో ప్రయాణించడం భారతీయ రైల్వే సాధించిన సాంకేతిక పురోగతిని అని నిపుణులు పేర్కొంటున్నారు.

