కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్ (Akkapur) గ్రామంలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ (Nirmal) – మంచిర్యాల జాతీయ రహదారిలోని కొండాపూర్ గ్రామం నుంచి అక్కాపూర్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా దెబ్బతిని అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.53 లక్షలు మంజూరైనా..
రహదారి దుస్థితిని స్థానికులు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) దృష్టికి తీసుకెళ్లడంతో జెడ్పీ నిధుల నుంచి రూ.53 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు మరమ్మతు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. నిధులు మంజూరై కూడా పనులు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పలు గ్రామాలకు ప్రధాన మార్గం..
ఈ రహదారి అక్కాపూర్(Akkapur)తో పాటు ముక్తాపూర్, న్యూ వెల్మల్, బొప్పారం, కూచన్ పల్లి, సంగంపేట్ తదితర గ్రామాల ప్రజలకు ప్రధాన రాకపోకల మార్గంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి గుంతలమయంగా మారడంతో ప్రజలకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు. ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో పలువురు వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. వెంకటాపూర్ మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తుండటంతో అదనంగా కిలోమీటర్ల దూరం సమయం, ఇంధన వ్యయం పెరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read : ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై ‘వందే భారత్‘ కొత్త రికార్డు!
Follow Us On: X(Twitter)

