కలం, వెబ్ డెస్క్: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఘన నివాళులు అర్పించారు. యువత శక్తిపై అపార విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని రాజీవ్ గాంధీ నమ్మారని గుర్తుచేశారు. 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో యువశక్తికి ప్రాధాన్యం పెంచారని చెప్పారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసి, యువతకు నూతన అవకాశాల దారులు తెరిచిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణను దేశానికి తీసుకువచ్చారని చెప్పారు. దీంతో దేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకెళ్లిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి, దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కూడా యువత అభివృద్ధి, డిజిటల్ పురోగతి, క్రీడలు, ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

