కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తాజాగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ అభిమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ, తన పెద్ద లక్ష్యాన్ని కూడా వెల్లడించాడు. ఈ సీజన్లో జట్టును ఫైనల్కు తీసుకెళ్లి టైటిల్ అందిస్తానని అభిమానులు ఆశించారని, అది జరగకపోవడం తనకు బాధ కలిగించిందని వైభవ్ తెలిపాడు. అయితే ఆ నిరాశ ఎక్కువ కాలం ఉండదని, భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) అభిమానులకు ప్రత్యేక సందేశం ఇస్తూ, కేవలం రెండో టైటిల్ మాత్రమే కాకుండా మూడు, నాలుగు, ఐదు ట్రోఫీలు కూడా గెలవాలన్నదే తన టార్గెట్ అని చెప్పాడు. అభిమానులు ఇలాగే జట్టుకు అండగా నిలవాలని కోరాడు. ఐపీఎల్ సమయంలో సోషల్ మీడియాలో తనపై వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయానని వైభవ్ వెల్లడించాడు. తాను అవుట్ అయినప్పుడు బాధపడిన అభిమానుల వీడియోలు, కుటుంబాల స్పందనలు తనను ఎంతో కదిలించాయని తెలిపాడు.

