కలం, హుజూర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గాన్ని (Uttam Kumar Reddy) అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే నరసింహలతో కలిసి పాలకవీడు, మట్టంపల్లి, చింతలపాలెం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.1.43 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రూ.600 కోట్లతో చేపట్టిన జవహర్ జాన్పహాడ్ ఎత్తిపోతల పథకంతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.18 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
నియోజకవర్గానికి మంజూరైన 5,000 ఇళ్లను బూత్కు 15 చొప్పున పారదర్శకంగా కేటాయిస్తామని తెలిపారు. అల్లీపురంలో అమరవరం–కొత్త తండా వరకు రూ.12 కోట్లతో ఆర్ అండ్ బీ డబుల్ రోడ్డు పనులను ప్రారంభించారు. కొత్తగా వేసిన తారు రోడ్లపై ఐరన్ వీల్స్ ఉన్న ట్రాక్టర్లను నడిపి, రోడ్లను పాడు చేయవద్దని ప్రజలకు సూచించారు.
అడ్లూరు వద్ద రూ.23 కోట్లతో మేళ్లచెరువు–చింతిర్యాల డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రేబల్లెలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.10 లక్షల మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించారు. మహిళలు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాలతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు స్వశక్తితో నిలబడేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తోందన్నారు. వీటి ద్వారా వ్యాపారాలు, డైరీలు ఏర్పాటు చేసుకుని ఆదాయం పెంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ, పంచాయతీరాజ్ ఈఈ వెంకటయ్య, ఆర్ అండ్ బీ ఈఈ సీతారామయ్య, డీఆర్డీఓ పీడీ సన్యాసయ్య, తహసీల్దార్ వాజిద్ అలీ, ఎంపీడీఓ లక్ష్మి, నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి, స్థానిక సర్పంచులు సుజాత, పెరుమాళ్ల సురేశ్, జ్యోతి, నాగిరెడ్డి, మాధవి, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

