కలం, వెబ్ డెస్క్: బాన్సువాడ నియోజకవర్గ రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) శుభవార్త చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పలు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసినట్టు తెలిపారు. జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసినట్టు తెలిపారు. త్వరలో వీటిని ప్రారంభించనున్నారు. రూ. 106.04 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకాలతో నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మొస్రా మండలాల పరిధిలోని 7,975 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఉత్తమ్ తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి జకోరా,చందూర్, చింతకుంట ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా నీటి పంపిణీ ప్రారంభమవుతుందని వివరించారు. ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన పంప్హౌస్లకు 2.93 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని, తద్వారా నీటి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకాలతో ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు అదనంగా కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించడం చెరువులు, కుంటలను నింపి భూగర్భ జలాలను పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకాలకు ట్రయిల్ రన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ పథకాలు ప్రారంభమైతే ధాన్యం దిగుబడి పెరుగుతుందని చెప్పారు. రైతుల అభ్యున్నతికి సాగునీటి విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందని గుర్తు చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టులను ప్రారంభించి రైతులకు అంకితం చేస్తామని మంత్రి ఉత్తమ్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రకటించారు.

