కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న పోరులో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నాళ్లూ తన ఫామ్పై సందేహాలు వ్యక్తం చేసిన వారికి తన ట్రేడ్ మార్క్ షాట్లతోనే సమాధానమిచ్చాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి వరకు అజేయంగా నిలిచి, కేవలం 56 బంతుల్లోనే 115 పరుగులు పిండుకున్నాడు. 205.35 స్ట్రైక్ రేట్తో సాగిన అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 4 కళ్లు చెదిరే సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ సునామీకి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15) వికెట్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ ప్రభావం సంజూపై ఏమాత్రం పడలేదు. యంగ్ సెన్సేషన్ ఆయుష్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దిన సంజూ, ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆయుష్ (59) అర్థ సెంచరీతో మెరవగా, వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆయుష్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (20 నాటౌట్) కూడా ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో సంజూ చూపిన తెగువకు ఢిల్లీ ప్రధాన బౌలర్లు టి. నటరాజన్, లుంగీ ఎన్గిడి చేతులెత్తేశారు. నటరాజన్ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకోగా, ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ మాత్రమే ఒక వికెట్ తీసి కాస్త పర్వాలేదనిపించాడు. దీంతో ఢిల్లీ ముందు 213 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.

