కలం, వెబ్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా- ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. హర్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేయాలని అమెరికా నౌకాదళాలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్ అణ్వాయుధాల విషయంలో వెనక్కి తగ్గడం లేదని .. అందుకే చర్చలు విఫలమయ్యాయని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. చర్చలు ఫలించకపోవడం పరిస్థితి మరింత కఠినంగా మారిపోయింది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేయాలన్న ట్రంప్ ఆదేశాలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది.
తమ భూభాగంపై లేదా సముద్ర హక్కులపై ఎవరైనా ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. “శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా వారి ప్రాణాలకే ప్రమాదం” అంటూ ఇరాన్ సైనిక వర్గాలు ప్రకటించాయి. హర్మూజ్ పరిధిలో తమ సైనిక శక్తి బలంగా ఉందని, అవసరమైతే తక్షణమే ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

