కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ( US Iran Peace Talks) జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ ప్రతిపాదించిన షరతులను అమెరికా ప్రతినిధి బృందం తిరస్కరించింది. ఈ మేరకు ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధుల విడుదలకు నిరాకరించింది. ఈ మేరకు పలు దేశాల్లో ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాల్ని విడుదల చేసేది లేదని అమెరికా ప్రతినిధి బృందం తేల్చి చెప్పింది.
పశ్చిమాసియా సంఘర్షణకు చెక్ పెట్టేలా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు కాసేపటి క్రితం మొదలయ్యాయి. ఇరాన్ చర్చల బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నేతృత్వంలోని చర్చల బృందం చర్చల్లో పాల్గొంది. చర్చల్లో భాగంగా తొలుత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందంతో పాకిస్తాన్ ప్రధాని భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రతిపాదించిన షరతులను అమెరికా ఒప్పుకోలేదు.
లెబనాన్ పై దాడులను ఆపడం, ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం అనే రెండు షరతులను అంగీకరిస్తేనే తాము శాంతి చర్చలకు సిద్దమని ఇరాన్ తెలిపింది. ఈ సందర్భంగా లెబనాన్ సీజ్ ఫైర్, ఇరాన్ నిధుల విడుదలకు అమెరికా అంగీకరించిందని అంతకుముందు ఇరాన్ ప్రకటన చేసింది. దీనికోసమే తాము శాంతి చర్చల్లో (US Iran Peace Talks) పాల్గొనేందుకు వెళ్తున్నామని చెప్పేసింది. అయితే ప్రస్తుతం అమెరికా తాజా నిర్ణయంతో ఇరాన్ ఖంగుతింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇరాన్ అంగీకరిస్తుందా? లేదా మళ్లీ యుద్ధం అంశం మొదటికొస్తుందా? అనే అంశం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతోంది.
Read Also: కాళేశ్వరంపై CBIలో కదలిక.. విచారణకు కేసీఆర్, హరీశ్రావు?
Follow Us On: Instagram

