కలం, వెబ్ డెస్క్ : ‘‘జానీ జానీ ఎస్ పప్ప’’ నర్సరీ రైమ్.. భారతీయ విలువలకు ప్రతిబింబం కాదని, అది చిన్నపిల్లల్లో అబద్ధాలు చెప్పే బీజాలను నాటుతున్నదని యూపీ ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ (Yogendra Upadhyay) అన్నారు. కాన్పూర్లోని మర్చంట్ చాంబర్ హాల్లో జరిగిన ‘శిక్షా మిత్రల’ (పారా టీచర్లు) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వెస్ట్రన్, భారతీయ విలువల మధ్య ఉన్న తేడాలపై ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి తరం పిల్లలకు అవసరమైన విలువలను ఇంగ్లీష్ రైమ్స్ అందించలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘జానీ జానీ ఎస్ పప్ప.. ఈటింగ్ షుగర్? నో పప్ప” వంటి పదాలు పిల్లలు తమ తల్లిదండ్రుల ముందే అబద్ధాలు చెప్పేలా ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. దీనికి విరుద్ధంగా, పాత తరాలు చదువుకున్న హిందీ పద్యాల్లో జీవితానికి సంబంధించిన లోతైన విలువలు ఉండేవని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా.. విద్యార్థులకు నైతిక విలువలను బోధించాలని కోరారు. భారతీయ పురాతన ‘గురు-శిష్య పరంపర’ను గౌరవిస్తూ.. ఉపాధ్యాయులు ఒక గురువు స్థానాన్ని పొందినప్పుడే విద్యార్థుల్లో విలువలను పెంపొందించగలరని అన్నారు.

