కలం, వెబ్ డెస్క్ : భారత దేశంలో ఇప్పటి వరకు ఒక్క ఎబోలా వైరస్ (Ebola Virus) కేసు నమోదు కాలేదని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (Union Minister JP Nadda) తెలిపారు. ఆఫ్రికాలో ఎబోలా కేసులు విజృంభిస్తున్న వేళ భారత్ లో వైరస్ వ్యాప్తి నివారించడానికి తీసుకున్న చర్యలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఎబోలాపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. సరైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ సరిహద్దులతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాకింగ్, టెస్టింగ్, సర్వైలెన్స్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ మేరకు నడ్డా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) లకు ఆదేశాలు జారీ చేశారు.
ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (PHEIC)గా ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే కేంద్రమంత్రి జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు.

