కలం, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను భారత రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 131 పద్మ అవార్డులలో.. తొలి విడతగా 66 మంది గ్రహీతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశారు. వేడుకలో రాష్ట్రపతి 2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మ శ్రీ అవార్డులను ప్రదానం చేశారు.
అవార్డులు అందుకున్న తెలుగు ప్రముఖులు
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మామిడాల జగదీశ్, దీపికా రెడ్డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, డాక్టర్ గూడూరు వెంకటరావు, వెంపటి కుటుంబ శాస్త్రి, పాలకొండ విజయ్ ఆనంద రెడ్డి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ.. దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శమని వెల్లడించారు.

