కలం, వెబ్డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఉమ్మడి ప్రకాశం (Prakasam) జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేశారు. జిల్లాలోని పార్టీ నాయకుల మధ్య సఖ్యత లోపించడం, పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్తో పాటు పూర్తి జిల్లా కార్యవర్గ కమిటీని రద్దు చేస్తున్నట్లు మంగళగిరి కేంద్ర కార్యాలయం ద్వారా ప్రకటించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారందరికీ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని, పార్టీ విధానాలకు భిన్నంగా నడుచుకుంటే కఠిన చర్యలు తప్పవని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. నూతన కమిటీని ప్రకటించేంత వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలన్నింటినీ జనసేన కేంద్ర కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కమిటీ రద్దుపై జనసేన కార్యకర్తల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తుండగా మరికొందరు పార్టీ నిర్ణయం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

