కలం, వెబ్డెస్క్: ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) సమావేశంలో దేశ ఆర్థిక, మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న సంక్షోభం కారణంగా నెలకొన్న అంతర్జాతీయ ఆందోళనను దృష్టిలో పెట్టుకొని స్వయం సమృద్ధిని పెంచేలా వ్యవసాయం, ఇంధనం, రవాణా, విమానాయాన రంగాల్లో భారీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
భారత్ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా రూ.37,000 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ (Coal Gasification) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశీయ బొగ్గు నిల్వలను సింథటిక్ నేచురల్ గ్యాస్, ఇతర రసాయనాలుగా మార్చి విద్యుత్, ఎరువుల తయారీకి వినియోగిస్తారు. దీని వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ, యూరియా, మెథనాల్ వంటి వాటిపై ఆధారపడటం తగ్గుతుందని, భవిష్యత్తులో ఈ రంగంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక రవాణా, మౌలిక సదుపాయాల విషయానికి వస్తే గుజరాత్లో రూ.20,667 కోట్లతో అహ్మదాబాద్-ధోలేరాసెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వదేశీ సాంకేతికతతో నిర్మించే ఈ రైలు మార్గం 2030-31 నాటికి పూర్తి కానుంది. దీంతో సుమారు 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. అలాగే నాగ్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, ఆధునీకరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపి ద్వారా ఎయిర్ పోర్ట్లో ప్రయాణికుల కెపాసిటీని ఏడాదికి 3 కోట్లకు పెంచడంతో పాటు, నాగ్పూర్ సెంట్రల్ ఇండియాకు లాజిస్టిక్స్ హబ్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది.

