కలం, ఖమ్మం బ్యూరో: ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తూ, ప్రజల దాహార్తిని తీరుస్తున్నా.. భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా నిలిచిపోయిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని రథం గుట్ట వద్ద చేపట్టిన నిరసన దీక్షలు బుధవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. నెలల తరబడి జీతాలు అందక, తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల అవసరమైన తాగునీటి సరఫరాలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా, ప్రభుత్వం పస్తులు ఉంచడం విచారకరమన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ నాయకులు ములక నరేశ్, పెద్ద సంఖ్యలో మిషన్ భగీరథ కార్మికులు పాల్గొన్నారు.

