కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల (Government Schools) బలోపేతానికి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని, గుడికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో, అంతకంటే ప్రాధాన్యం బడికి కూడా ఇవ్వాలని ఎంపీ కడియం కావ్య (Kadiyam Kavya) సూచించారు. విద్యా వారోత్సవాల సందర్భంగా బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణా, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులు ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చాయని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయన్నారు.
పేద విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో సర్పంచులు, కౌన్సిలర్లు ముందుండాలని కోరారు. బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచాలన్నారు. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. మహిళల విద్యతోనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మాదకద్రవ్యాలు, బాల్య వివాహాలు లాంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించిందని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని అన్నారు. డ్రాప్ఔట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ గిరిరాజు బాబు, డీడబ్ల్యూఓ విశ్వజ, ఉల్లాస్ అడల్ట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, మండలాల ఎంఈవోలు, గ్రామ సర్పంచులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

