కలం, వెబ్ డెస్క్ : జపాన్లోని కాకామిగహరా వేదికగా మే 29 నుండి జూన్ 6 వరకు జరగబోయే మెన్స్ అండర్-18 ఆసియా కప్ హాకీ ((Asia Cup Hockey ) టోర్నమెంట్ కోసం 18 మందితో కూడిన బలమైన భారత జట్టు సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం హాకీ ఇండియా బుధవారం నాడు అధికారికంగా జట్టును ప్రకటించింది. భోపాల్లోని సాయ్ సెంటర్లో కోచింగ్ స్టాఫ్ సర్దార్ సింగ్, రజనీష్ మిశ్రాల పర్యవేక్షణలో జరిగిన కఠినమైన జాతీయ శిక్షణ శిబిరం తర్వాత ఈ తుది జట్టును ఎంపిక చేశారు. సన్నాహకాల్లో భాగంగా భోపాల్లోనే ఆస్ట్రేలియా అండర్-18 జట్టుతో జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్లో ఓడిపోగా, మిగిలిన రెండు మ్యాచ్లు డ్రా అయ్యాయి.
ఈ సిరీస్ అనుభవం ఆటగాళ్లకు అంతర్జాతీయ ఒత్తిడిని, మ్యాచ్ వేగాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిందని కోచ్ సర్దార్ సింగ్ పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ చాలా పోటీగా సాగిందని, వ్యూహాత్మకంగా సమతుల్యత ఉన్న జట్టును ఎంచుకున్నామని ఆయన చెప్పారు. గత కొన్ని వారాలుగా ఆటగాళ్ల క్రమశిక్షణ, పెనాల్టీ కార్నర్ నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని గెలవడమే తమ లక్ష్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో భారత జట్టుకు ఫార్వర్డ్ ఆటగాడు కేతన్ కుష్వాహా కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
ఈ ఆసియా కప్ టోర్నీలో భారత్ పూల్-A లో సౌత్ కొరియా, ఆతిథ్య జపాన్, చైనీస్ తైపీ, కజకిస్తాన్ జట్లతో కలిసి పోటీ పడనుంది. ఫార్మాట్ ప్రకారం భారత్ మే 29న కజకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత మే 31న జపాన్తో, జూన్ 1న సౌత్ కొరియాతో, జూన్ 3న చైనీస్ తైపీతో తలపడుతుంది. పూల్-A, పూల్-B లలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా జూన్ 5న జరిగే సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. అనంతరం జూన్ 6న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
భారత జట్టులో గోల్కీపర్లుగా సావన్ కుమార్, ఆయుష్ రజక్ ఎంపికయ్యారు. డిఫెండర్లుగా అంశ్ బహుత్రా, అర్మాన్ సోరెంగ్, ఆశిష్ తాని పుర్తి, అర్ష్దీప్ సింగ్, అవి మణిక్పురి, రోమిత్ పాల్ బాధ్యతలు వహిస్తారు. మిడ్ఫీల్డర్లుగా రాహుల్ యాదవ్, ప్రేమ్చంద్ సోయ్, వరీందర్ సింగ్, కరణ్ గౌతమ్, సిద్ధార్థ్ బెన్ జట్టులో ఉన్నారు. ఫార్వర్డ్ విభాగంలో కెప్టెన్ కేతన్ కుష్వాహాతో పాటు ఆకాష్ దీప్, గాజీ ఖాన్, షారూఖ్ అలీ, ప్రహ్లాద్ రాజ్భర్ ప్రత్యర్థి జట్లను ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

