కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ( Maruti Suzuki) షాకింగ్ న్యూస్ చెప్పింది. అన్ని మోడళ్లపై రూ.30వేల వరకు ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించింది. జూన్ నుంచి ఈ పెంపు వర్తించనున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడి పదార్థాల ధరల భారం, పెరిగిన వ్యయాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.
గతేడాది జనవరిలో కూడా మారుతీ సుజకీ కార్ల ధరల్ని పెంచేసింది. ఆ సమయంలో మోడల్ను బట్టి కనీసం రూ. 1500 నుంచి గరిష్ఠంగా రూ. 32,500 వరకు పెంచింది. అయితే కేంద్రం 2025 సెప్టెంబర్లో చిన్న కార్లపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో చాలా వరకు కార్ల ధరలు తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో కార్ల ధరల పెంపును వాయిదా వేసింది. దీంతో సేల్స్ కూడా బాగా పెరిగాయి.
కాగా, మారుతీ సుజుకీ ప్రస్తుతం ఎస్-ప్రెస్సో వంటి ఎంట్రీలెవల్ మోడళ్ల నుంచి ప్రీమియం యుటిలిటీ వెహికల్ అయిన ఇన్విక్టో వరకు వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. వాటి ధరలు రూ. 3.49 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 28.7 లక్షల వరకు ఉన్నాయి. తాజా పెంపు నిర్ణయంతో ఆయా కార్ల ధరలు గరిష్ఠంగా రూ. 30,000 వరకు పెరగనుంది.

