కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా ఆదివారం ” అర్బన్ చాలెంజ్ ఫండ్ ” స్కీం అధికారి (UCF Official) నగరంలో ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. నగర సమగ్ర అభివృద్ధి నేపథ్యంలో విలీన గ్రామాల డివిజన్లైన రేకుర్తి, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. సంబంధిత ప్రాంతాల అభివృద్ధి నేపథ్యంలో స్థానిక రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, వరద నీటి కాలువలు, స్కైవాక్ నిర్మాణ ప్రదేశాలను స్వయంగా తనిఖీ చేసి పరశీలించారు. వర్షాకాలంలో తలెత్తే వరద సమస్యలు, మురుగు నీటి పారుదల ఇబ్బందులను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నగరంలోని డంపింగ్ యార్డును సందర్శించి పరిశీలించారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుల వారీగా నగరంలో క్షేత్ర స్థాయిలో వాటి స్థితిగతులను తనిఖీ చేసి పరిశీలించారు. కేంద్ర అధికారి పర్యటన సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు కేంద్ర బృందానికి ప్రతిపాదనలపై సమగ్ర వివరాలను అందించారు. ట్రాఫిక్ నియంత్రణ, పాదచారుల భద్రత కోసం మోడల్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, లోతట్టు ప్రాంతాలలో వరద ముంపును నివారించేందుకు డ్రైనేజీల పునరుద్ధరణ, నూతన కాలువల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనల పై క్షేత్ర స్థాయిలో పరిశీలిన చేశారు. ఈ పర్యటనలో ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈ దేవేందర్, ఏఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

