కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth)కి సరస్వతి నది అంత్య పుష్కరాల ఆహ్వానం అందింది. ఈ మేరకు సీఎంకు కలిసి సరస్వతి అంత్య పుష్కరాలకు మంత్రి కొండా సురేఖ, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు (Saraswati Anthya Pushkaralu) జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో మహేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
కాళేశ్వరం పుణ్యక్షేత్రం వేదికగా మే 21 నుండి జూన్ 1 వరకు సరస్వతీ నది అంత్య పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించనుంది. ఈ పుష్కరాలకు సుమారు 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు తెలిపారు. ఇటీవల పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల వద్ద పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు.

