కలం, మునగాల : సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బరకత్ గూడెం వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం ప్రకారం… ఒకే బైక్పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా, బరకత్ గూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఇద్దరు యువకులు తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులను వెంకట కుమార్, మణికంఠగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే మునగాల (Munagala) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ వాహనంలో తక్షణమే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి మరింత విషమించడంతో, మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం వైద్యుల సూచన మేరకు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై మునగాల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను అన్వేషిస్తున్నారు. ఒకే బైక్పై ముగ్గురు ప్రయాణించడం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

