కలం, మెదక్ బ్యూరో : బాలింతలైన వదిన-మరదళ్ల మృతి చెందిన విషాదకర సంఘటన మెదక్ (Medak) జిల్లాలో జరిగింది. చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో నెలలోపు బాలింతలైన వదిన-మరదళ్లు వరుసగా మృతి చెందారు . రెడ్డి పల్లి గ్రామానికి చెందిన కర్షన్న నారాయణ కుమారుడు కర్షన్న రమేష్ భార్య స్వాతి(26) ప్రసవం అనంతరం తన తల్లిగారిల్లు అయిన చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఉంటోంది. స్వాతికి నెలలోపు కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మెదక్ (Medak) ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
అనంతరం స్వాతి మృతదేహాన్ని అత్తగారిల్లు అయిన రెడ్డిపల్లికి తీసుకువచ్చారు. ఇదే సమయంలో స్వాతి కి వరసకు మరదలు అయిన కర్షన్న చిన్నముత్యం-లక్ష్మి దంపతుల కుమార్తె సౌందర్య (27) కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. నెలలోపు బాలింత అయిన సౌందర్యను కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా నార్సింగ్ దవఖానాకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. సౌందర్యకు నెలలోపు కుమారుడు ఉన్నాడు. ఆమె అత్తగారిల్లు వీరారెడ్డిపల్లి కాగా, ప్రసవానంతరం ప్రస్తుతం రెడ్డిపల్లిలోనే ఉంటోంది. ఒకే కుటుంబంలో గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలోనూ విషాద వాతావరణం నెలకొంది.

