కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల టెండర్లలో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) కుమార్ ఆరోపించారు. హాస్టళ్లకు సంబంధించిన కిరాణా, నిత్యావసర సరుకుల కొనుగోళ్ల టెండర్లలో 500 కోట్ల స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. ఈ కేంద్రీకృత టెండర్ విధానంపై ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
శనివారం ఆయన ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. గురుకులాల్లో సరఫరా వ్యవస్థను కేంద్రీకృతం చేయడం ద్వారా జిల్లా స్థాయి భాగస్వామ్యం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కొనుగోలు విధానాన్ని కొనసాగిస్తే పారదర్శకత ఉండే అవకాశం ఉంటుందని శ్రవణ్ (Dasoju Sravan) పేర్కొన్నారు.
తెలంగాణ బ్రాండ్ తాండూరు కందిపప్పు వంటి స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. అదే విధంగా స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన మార్క్ఫెడ్ వంటి వాటిని మరింతగా వినియోగించుకోవాలని సూచించారు. టెండర్ నిబంధనల్లో మార్పుల కారణంగా చిన్న వ్యాపారులు, స్థానిక సరఫరాదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మూడు నెలల బదులు దీర్ఘకాల టెండర్ విధానం తీసుకురావడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
గతంలో జరిగిన కొన్ని కొనుగోళ్లపై హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో, తాజా నిర్ణయాలను ప్రభుత్వం మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. మొత్తంగా, గురుకులాల సరఫరా వ్యవస్థలో స్థానిక భాగస్వామ్యం పెంచుతూ పారదర్శకతను మరింత బలోపేతం చేయాలని దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని కోరారు.

