కలం, వెబ్ డెస్క్: ఏపీలోని రాజంపేట (Rajampet)లో టీడీపీ నేతలు ఓ వృద్ధుడి సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) నిధులు పక్కదారి పట్టించిన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. తుంటి ఎల్లయ్య అనే వృద్ధుడు ఓ ప్రమాదంలో కన్ను కోల్పోవడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనికి సంబంధించి చెన్నై, తిరుపతిలో చికిత్స చేసుకున్నాడు. చికిత్సకు రూ.35 లక్షలు ఖర్చు కాగా, సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో తనకు రూ.14 లక్షలు మంజూరయ్యాయి. ఈ రూ.14 లక్షల్లో నుంచి రూ.8 లక్షలు టీడీపీ నేతలు తమ ఖాతాలోకి వేసుకున్నారని బుధవారం ఎల్లయ్య ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఈ డబ్బును తన ఖాతాలో జమ చేసుకున్నాడని, అడిగితే ఫండ్ ఇప్పించినందుకు తాము అందరికీ పర్సంటేజీలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిపాడు. తనకు న్యాయం చేసి డబ్బు తిరిగి ఇప్పించాలని కోరాడు. ఇక మళ్లీ ఎల్లయ్య తాజాగా మరో వీడియో విడుదల చేశాడు.
తనకు ఆపరేషన్ అయినప్పుడు వేణుగోపాల్ తనకు సాయం చేశాడని, అతడు ఆ సమయంలో అప్పు ఇవ్వడం వల్లనే ఇప్పుడు బతికి ఉన్నానని వీడియోలో చెప్పాడు. అనారోగ్యం, ఒత్తిడి కారణంగా తనకు మతిస్థిమితం సరిగా ఉండదని, అప్పు తీసుకున్న సంగతి గుర్తు లేక వేణుగోపాల్పై ఆరోపణలు చేశానని క్షమాపణలు చెప్పుకొచ్చాడు. మరోవైపు ఎల్లయ్య బామ్మర్ది శశికుమార్కు వేణుగోపాల్ రూ.లక్ష ఇచ్చినట్లు ఓ ప్రామిసరీ నోట్ విడుదల చేశారు. దీనిపై శశికుమార్ స్పందిస్తూ అసలు తాను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదని వెల్లడించారు. అసలు వేణుగోపాల్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. అందులో ఉన్న సంతకం తనది కాదని, తాను ఇంగ్లీష్లో సంతకం చేస్తానని చెప్పాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో మాట చెప్తుండటం.. బాధితుడు ఒక్క రోజులోనే మాట మార్చడంపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడిని ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే ఇలా చెప్తున్నాడేమోనని భావిస్తున్నారు.
Read Also: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం : అచ్చెన్నాయుడు
Follow Us On : WhatsApp

