కలం, వెబ్ డెస్క్ : చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు (DC) నిరాశే ఎదురైంది. గెలుపు ముంగిట స్టార్ ఫినిషర్ డేవిడ్ మిల్లర్ (David Miller) చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఈ పోరులో ఢిల్లీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్ ఉన్నారు. ఆఖరి ఓవర్ మొదటి నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్, ఒక సింగిల్ రావడంతో పాటు ఒక వికెట్ కూడా పడింది. ఐదో బంతి సమయానికి ఢిల్లీ విజయానికి కేవలం రెండు పరుగులు మాత్రమే కావాలి. ఆ సమయంలో మిల్లర్ స్ట్రైకింగ్లో ఉన్నాడు.
అయితే, ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా మిల్లర్ నిరాకరించాడు. అవతలి ఎండ్లో ఉన్న కుల్దీప్ యాదవ్కు (Kuldeep Yadav) స్ట్రైకింగ్ ఇవ్వడం ఇష్టం లేక మిల్లర్ అక్కడే ఉండిపోయాడు. కానీ, ఆఖరి బంతిని మిల్లర్ కనెక్ట్ చేయలేకపోయాడు. బై రన్ కోసం ప్రయత్నించిన క్రమంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ అప్రమత్తతతో కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ విజయం అంచున ఆగిపోయింది.
మిల్లర్ (David Miller) నిర్ణయంపై మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ స్పందించారు. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ రాని ఆటగాడు కాదని, అతనికి సింగిల్ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కుల్దీప్ అప్పటికే ఒక సింగిల్ తీశాడని, తనను తాను నిరూపించుకోగల సామర్థ్యం అతనికి ఉందని కార్తీక్ పేర్కొన్నారు. ఫీల్డింగ్ జట్టుపై ఒత్తిడి పెంచేలా సింగిల్ తీసి ఉండాల్సిందని ఆయన విశ్లేషించారు.
అనుభవజ్ఞుడైన మోహిత్ శర్మ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఒక బంతికి ఒక పరుగు కావాల్సినప్పుడు కుల్దీప్ సులువుగా కొట్టగలడని ఆయన చెప్పారు. కుల్దీప్ భారీ సిక్సర్లు కొట్టలేకపోవచ్చు కానీ, మ్యాచ్ను టై చేసే ఒక్క పరుగును కచ్చితంగా తీయగలడని మోహిత్ వివరించారు. మిల్లర్ తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం వల్లే ఢిల్లీ మూల్యం చెల్లించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. మిల్లర్ లాంటి సీనియర్ ఆటగాడు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Read Also: విమానంలో వైన్ తాగుతున్నారా? జాగ్రత్త!
Follow Us On : WhatsApp

