కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్లో (Nizamabad) పసుపు రైతులు ఆందోళనకు దిగడంతో మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ-నామ్ విధానం సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం వల్ల సాధారణ వేలం కొనుగోళ్లు జరుగుతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కుర్చీలు, టేబుల్స్, ఇతర ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ప్రధాన గేటు వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులతో గొడవకు దిగారు. మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ-నామ్ అప్డేట్ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల రోజులుగా ఈ-నామ్ క్రయ విక్రయాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి పసుపు కొనుగోళ్లు చేస్తూ తక్కువ ధర ఇస్తున్నారని ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో లభించే ధర తమకు దక్కడం లేదని, ఈ నామ్ ద్వారానే కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ మార్కెట్కు ఉత్తర తెలంగాణ నుంచి పసుపు వచ్చే సీజన్లోనే అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రైతులు (Turmeric Farmers) ఆందోళనలో పాల్గొన్నారు.

