కలం, వెబ్డెస్క్: తమిళనాడులో రోజురోజుకూ పెరుగుతున్న హత్యల పట్ల ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ (TTV Dhinakaran) తీవ్ర ఆందోలన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తమిళనాడు కొత్త ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. కాంచీపురం పడప్పైలో పార్ట్ టైం జాబ్ చేసే విద్యార్థుల నరికివేత, తూత్తుకుడిలో మద్యం గొడవలో యువకుడి హత్య, కోవిల్పట్టి బస్టాండ్లో జరిగిన హత్య, సేలం సమీపంలో మద్యం మత్తులో తోటి విద్యార్థుల చేతిలోనే ఒక విద్యార్థి కొట్టి చంపబడటం వంటి వరుస ఘటనలను ఆయన ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రోజుకో హత్య జరుగుతుందని, ఈ ఘోరాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని దినకరన్ పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో డీఎంకే పాలనలో పోలీసుల చేతులు కట్టేయడం వల్లే శాంతి భద్రతలు క్షీణించాయని, ఇప్పుడు తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే పరిస్థితి పునరావృతమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడంలో గత ప్రభుత్వంలాగా ఈ నూతన ప్రభుత్వం విఫలం కాకూడదని హితవు పలికారు. కేవలం హంతకులను పట్టుకోవడమే కాకుండా, శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రాథమిక విధి అని సీఎం గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. టీవీకే ప్రభుత్వం దీనిపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని దినకరన్ డిమాండ్ చేశారు.

