కలం, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి నిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదం అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న 82 వేల కిలోల నిల్వ సామర్థ్యాన్ని ఏకంగా 2.26 లక్షల కిలోల వరకు పెంచినట్లు టీటీడీ ప్రకటించింది. దాతల సహకారంతో అదనంగా నాలుగు భారీ ట్యాంకర్లు ఏర్పాటు చేయగా, మొత్తం 16 ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ కొత్త వ్యవస్థతో 15–16 రోజులకు సరిపడా నెయ్యిని ముందుగానే నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది. అవసరమైతే నాణ్యత ప్రమాణాలకు తగని నెయ్యిని తిరిగి పంపించి కొత్త నిల్వలను తీసుకునే వెసులుబాటు కూడా టీటీడీకి లభించింది. ప్రస్తుతం సాధారణ రోజులలో రోజుకు సుమారు 4 నుండి 4.5 లక్షల లడ్డూలు తయారవుతుండగా, విశేష రోజులలో ఇది 7 నుండి 8 లక్షల వరకు చేరుతోంది. రోజుకు సుమారు 16 వేల కిలోల నెయ్యి వినియోగం జరుగుతోందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మరో లక్ష కిలోల నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా కూడా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో లడ్డూ ప్రసాదం నాణ్యత, సరఫరా మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు.

