కలం, వెబ్డెస్క్: ఏపీ ఇంటర్ (AP Inter) పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అధికారుల తప్పిదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఓ విద్యార్థినికి ఒక సబ్జెక్టులో 6 మార్కులు రాగా, రీవాల్యుయేషన్ (Re evaluation)లో ఏకంగా 60కి 60 మార్కులు రావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు (Guntur) జిల్లా నూతక్కి గ్రామానికి చెందిన కావ్య ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసింది. కావ్య అన్ని పరీక్షలు బాగానే రాశానని, మంచి మార్కులు వస్తాయన్న ధీమాతో ఉంది. ఇక ఇంటర్ ఫలితాలు విడుదలవగా రిజల్ట్ చూసుకున్న కావ్యకు దిమ్మదిరిగిపోయింది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన కావ్య బోటనీ సబ్జెక్టులో కేవలం 6 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యింది. విద్యార్థిని ఇంట్లో వాళ్లు సైతం రిజల్ట్స్ చూసి షాకయ్యారు. కావ్యకు ఫలితాలపై నమ్మకం కుదరక రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుంది.
ఇక రీవాల్యుయేషన్ అనంతరం వెలువడిన ఫలితాలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. కావ్యకు కేవలం 6 మార్కులు వచ్చిన అదే పేపర్కు ఏకంగా 60కి 60 మార్కులు వచ్చాయి. డేటా ఎంట్రీ, లేదా పేపర్ కరెక్షన్ సమయంలో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థిని ఏడాది కష్టం వృథా అయ్యే పరిస్థితి ఎదురైంది. విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే పరీక్షల ఫలితాల ప్రకటనలో అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యా శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యా వేత్తలు కోరుతున్నారు.

