కలం, వెబ్ డెస్క్ : ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి అబుదాబిలో ఘనస్వాగతం లభించింది. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి ఎయిర్ ఫోర్స్ ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా నిలిచి గౌరవ వందనం సమర్పించాయి. విమానాశ్రయంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధానికి గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఏఈపై జరిగిన దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. యూఏఈని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. జాతీయ ఐక్యత, భద్రత, ప్రాంతీయ సమగ్రతను కాపాడటానికి యూఏఈ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. కష్టకాలంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజానికి అండగా నిలిచినందుకు, వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నందుకు యూఏఈ ప్రభుత్వం, రాయల్ ఫ్యామిలీతో పాటు అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు ప్రధాని మోదీ (PM Modi) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

