కలం, వెబ్ డెస్క్ : తిరుమల కొండపై సామాన్య భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ, దర్శన వేళల్లో ఇప్పటికే పలు మార్పులు చేసిన టీటీడీ (TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే శ్రీవారి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేక సేవను సామాన్య భక్తులు కూడా వీక్షించేలా అవకాశం కల్పించారు.
కొండపై రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దాదాపు 5,850 మంది సామాన్య భక్తులకు శ్రీవారి అభిషేక సేవను కళ్లారా చూసే భాగ్యం కలుగుతుంది. టీటీడీ (TTD) తీసుకున్న ఈ నిర్ణయంపై సాధారణ భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిన్న గురువారం ఒక్క రోజే ఏకంగా 79 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

