కలం, వెబ్ డెస్క్: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గాయి. ఈ మేరకు ఏపీ బస్సులతో సమాన ఛార్జీలు ఉండే విధంగా తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను తాజాగా సవరించారు. ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల్లో, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల కన్నా అధికంగా ఛార్జీలు వసూలు చేసేవారు. ఏపీలో తిరిగే తెలంగాణ బస్సుల్లో దూరాన్ని బట్టి సుమారు రూ.20 నుండి రూ.130 వరకు అధిక ఛార్జీలు వసూలు చేసేవారు. దీనిపై ప్రయాణికులు ఎంతో కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకే మార్గంలో రెండు రాష్ట్రాల బస్సులకు వేర్వేరు ధరలు ఉండటాన్ని తప్పుబడుతున్నారు. రెండు రాష్ట్రాల బస్సుల్లో సమాన ఛార్జీలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో రంగంలోకి దిగిన ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.. తెలంగాణ ఆర్టీసీతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో సమానంగా తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు ఉండేలా టారిఫ్ల్లో సవరణలు చేయబడ్డాయి. తాజా సవరణలతో ఇకపై ఏ బస్సులో ప్రయాణించినా ఒకే రకమైన ఛార్జీలు ఉండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకుమందు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వేలాది సర్వీసుల్లో అధిక ఛార్జీల వల్ల ఏపీ ఆర్టీసీ బస్సుల కోసమే వేచిచూడాల్సి వచ్చేదని.. తాజా సవరణలతో ఇకపై ఏ బస్సులోనైన వెళ్లొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

