కలం, కరీంనగర్ బ్యూరో: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్జేయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ (Karimnagar) అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. జిల్లాలో గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినా, ఇప్పటి వరకు ఎన్ఓసీలు మంజూరు చేయలేదని తెలిపారు. వెంటనే ఎన్ఓసీలు జారీ చేసి, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్జేయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, రాష్ట్ర నాయకులు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
టీఎస్జేయూ కరీంనగర్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శిగా బొడిగె సురేష్, కోశాధికారిగా సూదుల వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా పడకంటి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా భాస్కర్, జాయింట్ సెక్రటరీలుగా సతీష్, ఆవుల శ్రీనివాస్, ఈసీ సభ్యుడిగా చింతం వెంకటేష్ ఎన్నికైనట్లు ప్రకటించారు.

