కలం, ఖమ్మం బ్యూరో: వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తూ, ఒక గిరిజన ఉపాధ్యాయుడిపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడిన చర్ల ప్రభుత్వ ఆసుపత్రి అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ ప్రసాద్పై జిల్లా కలెక్టర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనను విధుల నుండి సస్పెండ్ చేయాలని ఆదివాసి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ డిమాండ్ చేశాయి.
అసలేం జరిగిందంటే..
చర్ల ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వెళ్లిన గిరిజన ఆదివాసీ టీచర్ పలక నాగేశ్వరావు.. తన బైక్ను అక్కడ పార్క్ చేసి ఉన్న డాక్టర్ కారు పక్కన నిలిపారు. దీనిని చూసి ఆగ్రహానికి లోనైన డాక్టర్ కృష్ణ ప్రసాద్ సభ్యసమాజం తలదించుకునేలా, వినలేని అసభ్యకర పదజాలంతో ఉపాధ్యాయుడిని దూషించారు. అంతటితో ఆగకుండా అమానవీయంగా, దుందుడుకు స్వభావంతో ప్రవర్తించారు. ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు సందీప్ సాయంతో ఉపాధ్యాయుడి చేతులను వెనక్కి విరిచి పట్టుకోమని పురమాయించి, డాక్టర్ కృష్ణ ప్రసాద్ సదరు ఉపాధ్యాయుడి చెంపలపై విచక్షణారహితంగా దాడి (Tribal Teacher Assaulted) చేశారు.
ఈ ఘటనపై ఉపాధ్యాయ, ఆదివాసి సంఘాల జేఏసీ నాయకులు ఊయికే బాలకృష్ణ, శ్యామల రామారావు, ఎస్.ఎస్.ఎస్. రవికుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యులు ప్రజలతో, రోగులతో సన్నిహితంగా, ప్రేమగా ఉంటూ సేవలు అందించాలని.. కానీ వృత్తి ధర్మాన్ని మరిచి రోగులపై చేయి చేసుకోవడం అత్యంత హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. “రోగులను ప్రేమించలేని డాక్టర్.. ఒక రోగితో సమానం” అని వారు ధ్వజమెత్తారు.
Read Also: తల్లి కాబోతున్న సమంత.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!
Follow Us On: Sharechat

