కలం, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి విషయంలో ఇకపై రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయే సైనికుల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితిని అరికట్టేందుకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ట్రాఫిక్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. వాహనంపై చలాన్ పడిన వెంటనే, సంబంధిత వాహనదారుడి బ్యాంకు ఖాతా నుండి నేరుగా జరిమానా మొత్తం కట్ అయ్యేలా ఆటోమేటిక్ సిస్టమ్ను తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు వివరాలను సేకరించాలని, ట్రాఫిక్, రవాణా శాఖలు ఈ డేటాను అనుసంధానం చేసుకోవాలని పేర్కొన్నారు. చలాన్ల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సమాజంలో సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి సమస్యల కంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న పాత అభిప్రాయాలను మార్చి, దానిని అత్యంత పటిష్టమైన విభాగంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. విద్యార్థి దశ నుండే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకున్నామని, అదే తరహాలో ట్రాఫిక్ నియంత్రణలోనూ విప్లవాత్మక మార్పులు తెస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Read Also: ‘నల్లమలసాగర్’పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Follow Us On: Sharechat


